సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, మే 2018, సోమవారం

శ్రీవిద్యోపాసన - 1



శ్రీచక్రపూజా లేదా పరాపరపూజ అత్యంత ఉన్నతమైన పూజావిధానము. జీవాత్మ పరమాత్మతో నిరంతరంగా ఏకీభూతమైనట్టుగా భావించుకుంటూ ఉండడమే శ్రీవిద్యోపాసన. పూజ అనునది మూడు రకములు. 1) పరాపూజ 2) అపరాపూజ 3) పరాపరపూజ.

రెండవదిలేదు అనగా ప్రతీమాట, ప్రతీ ఆలోచన అంతా అద్వైతభావనతోనే చేసే పూజనే పరాపూజ అంటారు. ఇది ఎంతో ఉన్నతమైనది.

తనకు భిన్నంగా ఇంకొకటి ఉన్నాది అని తలచి అనగా ద్వైతభావనతో తన ఎదురుగా శ్రీచక్రమునో లేక మరియొక విగ్రహాన్నో పెట్టుకొని చేసే పూజనే అపరాపూజ అని అంటారు. ఇది సాధారణ పూజ.

ద్వైతంతో మొదలుపెట్టి అద్వైతంతో ముగించేపూజ పరాపరపూజ. ఇది మధ్యస్తమైన పూజ.

ఏ సాధకుడి ఆలోచనలు, హృదయం అతడి బాహ్యస్మృతినివీడి ఎల్లప్పుడూ పరబ్రహ్మమందు నిలచిఉంటుందో అదే పరాపూజ. దీనినే ఋతంభరప్రజ్ఞ అని అంటారు. ఈ పూజ అంతా మానసికంగానే జరుగుతుంది. ఇది అందరికీ సాధ్యంకాదు. అలా సాధ్యం చేసుకున్నవారినే ఉత్తమాధికారులు అని అంటారు. వీరు ఎల్లప్పుడూ సచ్చిదానందరూపులై ఉంటారు.

మనసులో గూడుకట్టుకున్న ద్వైతభావనలను నిరంతర సాధనద్వారా అద్వైతభావనలోకి తీసుకు వెళ్ళగలగడమే పరాపరపూజ. ఈ సాధకులను మధ్యమాధికారులని అంటారు. కొంచెం అర్ధమైన రీతిలో చెప్పాలంటే బాహ్యపూజనుండి అంతఃపూజలోకి ప్రయాణంచేయడమే పరాపరపూజ.

తను బ్రహ్మమునకు భిన్నుడని భావించి తన ఎదురుగా ఒకఛాయను అనగా శ్రీచక్రాన్నో, విగ్రహాన్నో ఏదైనా పెట్టుకొని పూజా సామాగ్రి సమకూర్చుకొని కల్పసూత్ర ప్రకారంగా మంత్రములను చదువుతూ చేసెడి బాహ్యపూజను అపరాపూజ అని అంటారు. ఈపూజను, సాధన ప్రారంభదశలో ఉన్నవారుగాని, మధ్యమాధికారులు గాని పాటిస్తారు.

నిజానికి సాధారణ సాధకులకు పరాపూజ వెంటనే అబ్బదు. దానికి ఎంతో పూర్వజన్మ సాధనాపుణ్యఫలం ఉండి తీరాలి. ఉదాహరణకు భగవాన్ శ్రీరమణ మహర్షి. ఆయన పూర్వజన్మల పుణ్యఫలంవల్లనే ఈ జన్మలో పరాపూజా తత్పరులు అయ్యారు. అందరూ ఆయనవంటి వారు కాలేరు. కాని ప్రయత్నిస్తే తప్పకుండా ఆ స్థాయికి చేరగలరు.

కాని పరాపూజాధికారం రావాలంటే అపరాపూజలో నిష్ణాతులు కావాలి. ఏ సాధకుడైతే నిరంతర తపన, పట్టుదల, దీక్ష, గురుభక్తి, సాధన కలిగిఉంటాడో అతడు తప్పక ఆధ్యాత్మికంగా ఎదుగగలడు. ఇది తధ్యం.


పూజయే యజ్ఞము. అయితే శ్రీచక్రోపాసన ఏదో మనకు ఇష్టం వచ్చినప్పుడు, ఏదో కాళీగా ఉన్నాముకదా అని అప్పుడప్పుడు చేసేది కాదు. అది నిరంతర ఉపాసన. శ్వాసతో పాటుగా జరగవలసిన ఉపాసన. జీవాత్మను పరమాత్మగా తెలుసుకోవడమే శ్రీవిద్యోపాసన లక్ష్యం. శ్రీవిద్యోపాసనకు మూడు అంగాలున్నాయి. వాటినే సంకేతాలంటారు. అవి మంత్రసంకేతం, చక్రసంకేతం, పూజా(తంత్ర)సంకేతం. ఇప్పుడు మనం ఈ సంకేతాలని క్లుప్తంగా అర్ధం చేసుకుందాం.

(ఇంకాఉంది)

కామెంట్‌లు లేవు: