సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

20, ఆగస్టు 2020, గురువారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 13

 

త్రైలోక్యడామర తంత్రము

ఇందు ఈవిధముగా చెప్పబడినది -

మంత్రములకు న్యాసము - పల్లవము మరియు ప్రణవము - శిరస్సు. ఈ రెండింటిచేత సంయుక్తమైన మంత్రము కామధేను సమానముగా ఫలప్రదము. న్యాసరహిత మంత్రము మూగతో సమానము. ఆసన రహిత సుప్త (నిద్ర), పల్లవ రహిత నగ్న,

శిరవిహీన మృత మరియు గురువు లేని మంత్రము వ్యర్ధములు అవుతాయి. దుష్టునికి ఇచ్చిన మంత్రము హతమవుతుంది. అధికాక్షర మంత్రము నిర్వీర్యమవుతుంది.

అన్యబీజములను కలిపితే అది కీలితమవుతుంది. ఏ మంత్రమునైనా ఇతరులకు వినిపిస్తే అది శూన్యమవుతుంది. ఋషి, దేవత, ఛందస్సు లేని మంత్రము భుజంగ, మృత, నగ్న, వీర్యహీన, వ్యర్ధ మరియు హతము అవుతుంది. భుజంగ, కీలిత, శూన్య మంత్రముల ఫలంజు లభించదు. ఎవరికైతే సిద్ధికలగాలని కోరిక వుంటుందో వారు ఈ మంత్రములను ప్రయత్నపూర్వకంగానైనా పరిత్యజించాలి. శాంతి కర్మములందు మంత్రము నమోంతగా చెయ్యాలి. వశ్య, ఆకర్షణ మరియు హోమ కర్మములందు స్వాహాన్త మంత్రము సిద్ధిప్రదాయకము. పుష్ట్యాదులందు మంత్రము వౌషట్ పల్లవ యుక్తమవుతుంది. హుం కార పల్లవ యుక్త మంత్రము బ్రాహ్మణులకు తప్ప ఎవరికైనా మారణ ప్రయుక్తమవుతుంది. సుఘోర, భయనాశనము గురించి మంత్ర జపము చివర వషట్ ఉంచాలి. అది మహాకాల గ్రహముల వినాశకమవుతుంది. ఖండన, ఉచ్చాటన, వేధ గురించి మంత్రము ఫట్ పల్లవాయుక్తమవుతుంది. వేదాంగ సముద్భూత మంత్రము ఓం కారముతో ప్రారంభమవుతుంది. ఆగమ మంత్రములందు పల్లవ ఉంటుంది. వైదిక మంత్రములందు పల్లవము ఉందదు. వేదసముద్భూత మంత్ర జపము పల్లవము లేకుండా కూడా జరుగుతుంది. ఐశ్వర్యయుక్త సాధకుడు నగ్నమంత్రమును జపించరాదు.

       అనునాసిక అక్షరసహిత మంత్రమును స్తంబిత అంటారు. (సానునాసిక-నిరనునాసిక లక్షణములు మాతృకా శ్వాసనందు తెలుసుకొనవచ్చును). ఈ విషయమును త్రిపురార్ణవమునందు కూడా చెప్పబడినది. అకాలవినియోగము చేత మంత్రము ప్రమత్త అవుతుంది. అనుకూల స్వర, ఋణీ మంత్ర జపము అనుకూల సమయమందు శుభము అవుతుంది. అన్యసమయములందు మంత్ర జపము ప్రమత్త అవుతుంది.

       కాలలక్షణమును కామ్యశ్వాస నుండి తెలుసుకోవాలి. సుషుప్తి కాలమందు మంత్ర జపము ప్రబుద్ధమవదు. త్రిపురార్ణవమునందు కూడా ఈ విషయం చెప్పబడినది. వామనాసాపుట నుండి శ్వాస జరిగే సమయము సుషుప్తి కాలము అవుతుంది. దక్షనాసాపుట నుండి శ్వాస జరిగే సమయమును జాగ్రదావస్థ అంటారు. సుషుప్తి కాలమందు అప్రబుద్ధ మంత్రజపము సాధకుడిని నాశనము చేస్తుంది. పుస్తకమును చూసి జపము చేసే మంత్రము కృద్ధ అవుతుంది. త్రిపురార్ణవమునందు కూడా పుస్తకము చూసి ఏ సాధకుడు మంత్ర జపము చేస్తాడో అతని ఆయువు, కీర్తి, యశస్సు, ధనము - ఈ నాలుగూ నాశనమవుతాయని చెప్పబడినది. యోగినీ హృదయమునందు, మంత్రమునకు ప్రారంభము మరియు మధ్యన బీజము ఉంటే ఆ బీజము కీలకము అవుతుంది. మంత్రాంతరము నందు శక్తి బీజము ఉంటే శక్తి కీలకము అవుతుంది. ఏ వర్ణములకు కీలకత్వము ఉంటుందో వాటిని వదిలి, వాటికి ముందు మరియు వెనకాల వర్ణములకు కూడా కీలకత్వము ప్రాప్తిస్తుంది. అన్యవర్ణముల ద్వారా కీలిత మంత్రము సిద్ధిరోధకము అవుతుందని చెప్పబడినది.

       సంధిరహితమును రుద్ధ అంటారు. దీనిని సమస్త కార్యములందు వదిలిపెట్టాలి. ఈ విషయము యోగినీ హృదయము నందు చెప్పబడినది. వైరి అక్షరములతో యుక్తమైన మంత్రము దుఃఖితము అవుతుందని త్రిపురార్ణవము అందు చెప్పబడినది. కవచాది రహిత మంత్రము అంగహీనమవుతుంది. యోగినీ హృదయమును అనుసరించి, అంగ-ప్రత్యంగ-కవచ-స్తోత్రపాఠము లేని మంత్రము అసంపూర్ణమవుతుంది. ఆ మంత్రము సిద్ధినివ్వదు.

       అపూర్ణ ఉపదిష్ట మంత్రము హీనవీర్యమవుతుంది. హీనవీర్య మంత్రము అన్నీ కర్మములందు బహిష్కృతము. మనుష్యుల శాంతి కొరకు కాకుండా మరేదైనా కామ్యప్రయోగము వలన మంత్రము కుంఠిత మవుతుందని త్రిపురార్ణవము నందు చెప్పబడినది. ఇందువలననే ప్రయోగవిధి తర్వాత శాంతి చెయ్యాలి. శాంతి గురిచి సవితాగాయత్రితో బాటుగా మూలమంత్రమును పదివేల సార్లు జపము చెయ్యాలి.

       ఏకమాత్ర హ్రస్వము, రెండుమాత్రలు దీర్ఘము, త్రిమాత్ర ప్లుతము - ఇది స్వర లక్షణము. దీర్ఘాక్షరమును హ్రస్వముగా, ప్లుతమును దీర్ఘముగా, దీర్ఘమును ప్లుతముగా, హ్రస్వమును దీర్ఘముగా ఉచ్చరించడం వలన సిద్ధి కలగదని తంత్రాంతరమునందు చెప్పబడినది. 

       ప్రలాపపూర్వక మంత్ర జపము రుష్ట (=అప్రసన్న) అవుతుంది. ఎవరితో మాట్లాడకుండా మౌనంగా జపము చేయకపోతే ఆ మంత్ర సాధకుణ్ణి రాక్షసులు హరించును మరియు మంత్రము రుష్ట అవుతుంది మరియు సిద్ధి కలగదని త్రిపురార్ణవము నందు చెప్పబడినది.

       అన్యదేవతా మంత్రముతో మూలమంత్ర జపము మలినమవుతుంది. మంత్రాంతరము మరియు దేవతాంతరములు సర్వదా వర్జితములు. ప్రయోజనాంతరము మరియు సాధనాంతరము కూడా త్యజనీయములు. వేరుగా చేస్తే మాత్రము మంత్రము కామధేను సదృశమవుతుంది. కానీ, ఈ నాలుగుతోనూ సంయుక్తముగా చేస్తే మంత్రము మలినమవుతుంది.

       దేవత, గురు, మంత్రము వీరిని ఎప్పుడూ ఉపేక్షించరాదు. అవస్థాను ప్రకారంగా గానీ, కర్మచేతగానీ, దుఃఖము కలిగినప్పుడు గానీ  "ఈమంత్రమును ఎందుకు తీసుకున్నాను?" అని మనస్సునందు చింతించుచూ జపము చేయరాదు. అలా చేస్తే దానిని వైషమ్యము అంటారు. ఆ మంత్రము అవమానిత అవుతుంది.

       యోనిముద్రా బంధనము చేత అన్నిదోషములూ సమాప్తమవుతాయి.

ఇంకాఉంది

కామెంట్‌లు లేవు: