సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

20, ఏప్రిల్ 2023, గురువారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 59

 

శ్రీవిద్యాయజనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – అగ్ని, ఈశాన, నైరుతి, వాయవ్య, దిశలకు మధ్యన అంగదేవతలను పూజించాలి. సాధకుడు తన గురుక్రమానుసారంగా పూజ చెయ్యాలి. భూపురము, షోడశారము, అష్టదళము – ఈ క్రమము సృష్టిచక్రము. శ్రీ, పరిజ్యోతి, ఆద్యా క్రమంలో పూజచెయ్యాలి. చతుర్దశారము, బహిర్దశారము, అంతర్దశారము – ఈ క్రమము స్థితిచక్రము. అష్టకోణము, త్రికోణము, బిందువు – ఈ క్రమము సంహార క్రమము. దీని యందు తృతీయ సకలను పూజించాలి. అనాఖ్యను సకల అని కూడా అంటారు. సాధకుడు తురీయ సకల విద్యల క్రమంలో కూడా పూజ చెయ్యాలి. ఈ ప్రకారంగా సాధకుడు సంపూర్ణ విద్యాసమూహములతో పూజ చెయ్యాలి. సాధకుడు శ్రీకోశసింహాసనస్థ, కల్పలతాత్మక, రత్నాత్మక, చతురాయతనాత్మక, చతురన్వయగంభీర – వీరందరినీ కూడా పూజించాలి. యాభై వర్ణముల శరీర త్రైలోక్యచక్రమున ప్రకట యోగినులు అనబడు దశసిద్ధులను పూజించాలి. ఈ సిద్ధులు అప్పుడే కాల్చబడిన బంగారు వర్ణములో ఉంది పాశ, అంకుశములను ధరించి ఉంటారు. చేతుల్లో కమలములు ధరించి పెద్ద పెద్ద భండారములలో బంగారములను, నిధులను తమ భక్తులకు ఇస్తారు.

      అణిమ, లఘిమ, మహిమా, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య, భోగ, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ ఇవి ఈ ప్రకటయోగినుల పేర్లు. ద్వారములకు దక్షిణభాగములో, కోణములలో, పశ్చిమాది ప్రదక్షిణ క్రమంలో బ్రాహ్మీ, మాహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, చాముందా, లక్ష్మీ అను ఎనిమిది దేవతలను పూజించాలి. వీరనాదరూ పాశము, అంకుశము, పుస్తకము, శూలము, వజ్రము, శక్తి, చక్రము, గదా, యంత్రమాలా, పద్మము ధరించి ఉంటారు. సమస్త అలంకరణములతో శోభిల్లు వీరిని సిద్ధి కొరకు ధ్యానం చెయ్యాలి. క్షోభిణి, ద్రావిణి, ఆకర్షిణి, వశ్యకరిణి, ఉన్మాదకరణి, అంకుశ, ఖేచరీ, బీజ, యోని, త్రిఖండముద్రాలను తూర్పు నుండి పశ్చిమం వరకు అర్చించాలి. వీరందరూ పద్మరాగ మణుల కాంతితోనూ విరాజిల్లుతూ, సిందూర తిలకమును, రక్తవస్త్రములను, రక్తమాలను, ధరించి, పాశ, అంకుశములతో శోభిల్లుచూ ఉంటారు. ఇష్టసిద్ధి కొరకు వీరిని పూజించాలి.

      పదహారు స్వరములతో అలంకృత సర్వాశాపూరక చక్రములో పశ్చిమం నుండి విలోమ క్రమంలో ఈ క్రింది గుప్త నిత్యలను పూజించాలి.

కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, అమృతాకర్షిణి, స్మృత్యాకర్షిణి, శరీరాకర్షిణి, ఆత్మాకర్షిణి.

వీరు చంద్రమండలంలో నివసిస్తారు. వీరు అమృతవర్షమును కురిపిస్తారు. పాశము, అంకుశము కలిగి, సుధాపూర్ణ కాశ్మీర ఘటమును ప్రసాదిస్తారు. 

      సర్వసంక్షోభణ చక్రములో కవర్గము నుండి క్షవర్గము వరకు గుప్తతర యోగినులను పూజించాలి. వీరు బన్ధూక పుష్ప కాంతులు కలిగి ఉంటారు. చేతుల్లో పాశము, అంకుశాము, నీలమణి, నీలకమలము కలిగి ఉంటారు. పూర్వాది దిక్కులు, ఆగ్నేయాది విదుక్కులలో వీరిని పూజించాలి. వీరు – అనంగకుసుమ, అనంగమేఖల, అనంగమదనా, అనంగమదనాతురా, అనంగరేఖా, అనంగవేగినీ, అనంగాంకుశ, అనంగమాలినీ. కచట వర్గ వర్ణములతో విరాజితమైన మహాసౌభాగ్యప్రద చక్రములో సంప్రదాయయోగినులను పూజించాలి. వీరు ఇంద్రగోప వర్ణములో ఉంటారు. సగర్వ మరియు ఉన్మత్త యౌవనవంతులు. చేతుల్లో పాశము, అంకుశము, దర్పణము మరియు అమృతకలశము కలిగి ఉంటారు. వీరిని పశ్చిమాది విలోమ క్రమంలో పూజించాలి.

      కార్యసిద్ధి కొరకు సంప్రదాయానుసారము వీరిని పూజించాలి. వీరు – సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వాహ్లాదినీ, సర్వసమ్మోహిని, సర్వస్తంభనాకారిణి, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వానురంజనీ, సర్వోన్మాదకారిణీ, సర్వార్థసాధికా, సర్వసంపత్తిరూపిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ|

ఆకాశ వర్ణ సర్వార్థసాధకచక్రములో జపాకుసుమ వర్ణము కలిగి, మెరిసే మణులను ధరించి, మహాసౌభాగ్య గంభీరులు, పాశ-అంకుశములను ధరించి, రత్న పీఠముమీద ఉండు ప్రసన్న వదనముతో శోభిల్లుచూ ఉండు కులయోగినులను ధ్యానం చెయ్యాలి. వీరు అనేక రత్నములతో చేయబడిన దివ్యా ఆభూషణములను ప్రసాదిస్తారు. సర్వాసిద్ధులనూ ప్రసాదించే వీరిని పశ్చిమము నుండి విలోమక్రమంలో పూజించాలి.

మ నుండి క్ష వరకు దశ వర్ణములతో విభూషిత సర్వరక్షాకర చక్రములో ఈ క్రింది దేవతలను పూజించాలి –

సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ర్పద, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదా, సర్వదుఃఖవిమోచీనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ.

పశ్చిమము నుండి విలోమక్రమంలో నిగర్భ యోగినులను పూజించాలి. వీరు ఉదయించు కోటిసూర్యుల ప్రభలు కలిగి ఉంటారు. ముత్యములను, పాశ, అంకుశ, టంక, ఆయుధ మరియు జ్ఞానముద్రలను కలిగి ఉంటారు. వీరు యథేప్సిత ఫలములను ప్రసాదిస్తారు. వీరు – సర్వజ్ఞా, సర్వశక్తి, సర్వైశ్వర్యఫలప్రద, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపా, సర్వపాపహరా, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రద.

      అష్టవర్గ విభూషిత సర్వరోగహర చక్రమును పశ్చిమం నుండి విలోమ క్రమంలో రహస్య యోగినులను పూజించాలి. ఈ యోగినులు శ్రీపీఠమునకు కింద నాలుగు దిక్కులలో ఉంటారు. వీరు దానిమ్మ పండు రంగులో ఉండి రక్త వర్ణ వస్త్రములను ధరించి ఉంటారు. రక్తమాలా, రక్త అనులేపనము కలిగి అనేక ఆభూషణములను, పంచబాణములను, ధనస్సును, పుస్తమును, వరద ముద్రను కలిగి ఉంటారు. వీరిని రక్త పుష్పాక్షతలతో పూజించాలి. స్వరములకు చివర రుంబ్లూం జోడించి వశీనీ వాగ్దేవతను పూజించాలి. కవర్గ చివర కలహరీం జోడించి పరా కామేశ్వరీని పూజించాలి. చవర్గ చివర నీంవీంలీం స్వరూప మోదినీని పూజించాలి. టవర్గ చివర యీంలీం జోడించి విమలా దేవిని పూజించాలి. తవర్గ చివర క్షీంరీం జోడించి అరుణను పూజించాలి. పవర్గ చివర హంఠంలంవంయంఊం జోడించి జయినీని పూజించాలి. యవర్గ చివర లంరంక్షంయంహంఠం జోడించి సర్వేశ్వరి కౌలికాని పూజించాలి. అ క థ – ఈ మహా అక్షరములతో ఏర్పడిన సర్వసిద్ధిచక్ర త్రికోణమును పర, అపర, రహస్య నామ యోగినులను పశ్చిమాది క్రమంలో పూజించాలి.

      ఆ తర్వాత కామేశ్వర – కామేశ్వరీలను పూజించాలి. వీరిద్దరి ఆయుధములూ సమానంగా ఉంటాయి. అవి పంచబాణ, ధనస్సు, జంభ, మోహ, వశీకరణ, స్తంభన, పద, మంత్ర. (మొత్తం ఎనిమిది). వీటిని నాలుగు దిక్కులందు పూజించాలి. ఆ తర్వాత మూడు కోణములలో మూడు కూటముల  కామేశ్వరీ, వజ్రేశ్వరీ, భగమాలినీ అను దేవతలను పూజించాలి. కామేశ్వరీ శుక్లవర్ణము కలిగి, శుక్ల మాలను, శుక్ల లేపనము కలిగి, ముత్యముల ఆభరణములను ధరించి, చేతుల్లో పుస్తకము (వేదము), అక్షమాల, వరద, అభయ ముద్రలను కలిగి ఉండును. ఈమెను రుద్ర శక్తి అని అంటారు. ముందుగా ఈమెను పూజించాలి.

      వజ్రేశ్వరి కుంకుమ వర్ణములో ఉండును. మెరిసే రత్నములను ధరించి ఉండును. బాలసూర్య వర్ణ వస్త్రములు ధరించి, నీల వర్ణ నేత్రములు కలిగి ఉండును. చెరకు విల్లు, పుష్పబాణములు, వరద, అభయ ముద్రలను కలిగి ఉండును. ఈమెను విష్ణు శక్తి అని అంటారు. కామేశ్వరీ తర్వాత ఈమెను పూజించాలి. ఉత్తరమున భగమాలినిని పూజించాలి. అప్పుడే కాల్చబడిన బంగారం యొక్క వర్ణములో ఈమె ఉంటుంది. ఎంతో విలువైన రత్నములతో చేసిన ఆభరణములను ధరించి ఉండును. చేతుల్లో పాశము, అంకుశము, జ్ఞానముద్ర, వరదముద్ర, అభయముద్ర కలిగి ఉండును. ఈమెను బ్రహ్మ శక్తి అని అంటారు.

      శబ్దాతీత, నాదరూప, సర్వానందమయ చక్రములో పరాపర రహస్య నామక రతియోగినులను త్రికూటముతో పూజించాలి. బ్రహ్మరూపిణి చిన్మయీ మహాత్రిపురసుందరీ శ్రీవిద్యను పూజించాలి. పూజ తర్వాత తర్పణము చెయ్యాలి. ఆ తర్వాత మళ్ళీ గంధ, పుష్ప, అక్షింతలతో పూజించాలి. ముద్రలను ప్రదర్శించాలి. ముద్రలు అనేక అలంకారములతో సుందరముగా ఉండి మూడు లోకములనూ వశపరచుకొనును. వాటి చేతుల్లో వాని వాని ముద్రలను ధరించి ఉండును. ఇవన్నీ శ్రీవిద్యకు సమీపంగా ఉన్నట్లుగా భావించి ధ్యానం చెయ్యాలి. ఒక్కొక్క చక్రములోనూ ముద్రను, చక్రేశ్వరిని పూజించాలి.

      ఆ తర్వాత స్పటిక వర్ణము కలిగి, ముత్యములు మరియు రత్నముల ఆభరణములను ధరించిన, చేతుల్లో పుస్తకము, అక్షమాలా, అమృత కలశము, కమలము కలిగి ఉండు మహాపాపవినాశినీని సిద్ధి కొరకు ధ్యానము చెయ్యాలి. సుందరీ, బంధూకకుసుమప్రభా, సర్వాలంకారసంపన్న, పుస్తకము, అక్షమాలా, వరద, అభయ ముద్రలను ధరించిన, చిరునవ్వు ముఖము కలిగి ఉండు త్రిపురేశ్వరీని ధ్యానించాలి. ఈమెకు సమానంగానే త్రిపురవాసినీని ధ్యానించాలి. ఈమె కళ్ళల్లో చివర రక్త వర్ణము కలిగి ఉంటుంది. ఆ తర్వాత పీనవృత్తఘనస్తననీ, ఉదయించే సూర్యుని ప్రభాలు కలిగి ఉండు,  దివ్య అలంకారములతో అలంకరించబడిన, చేతుల్లో పుస్తకము, జపమాల, వరద, అభయ ముద్రలను ధరించి ఉండు త్రిపురాశ్రీని ధ్యానించాలి.

      ఆ తర్వాత ఇంద్రగోప కాంతి కలిగిన, చేతుల్లో పాశము, అంకుశము, కపాలము కలిగి ఉండు సకలానంద మాలినీని ధ్యానించాలి. ఈమె ఒక్క క్షణంలోనే సాధకుల భయమును పోగొట్టును. శత్రువులను నాశనము చేయు పరమేశ్వరి సిద్ధాను ధ్యానం చెయ్యాలి. సంపత్ప్రదా భైరవి మహాసిద్ధిప్రదాయిని. అత్యంత నిర్జన స్థానమునకు వెళ్ళి ఈ చక్రమును పూజించాలి. పాదుకాం పూజయామిలో నమస్కారము, హోమంలో స్వాహా, తర్పణంలో తర్పయామి అని చెప్పాలి. శ్రీచక్రములో సమస్త కిరణ రూపంలో దేవిని ధ్యానించాలి. ఈ చక్రారాధనను యోనిని ఏ విధంగా గోప్యంగా ఉంచుతామో ఆవిధంగానే గోప్యంగా ఉంచాలి.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన శ్రీవిద్యాయజనవిధివివరణం అను యాభైతొమ్మిదవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: