సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, ఏప్రిల్ 2023, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 60

 

బలియజనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – ఆరు రుచుల యుక్త, కామధేను పాలు మొదలగు వాటితో పవిత్రించిన నైవేద్యమును పరశక్తికి అర్పించిన తర్వాత కర్పూర సహిత తాంబూలమును సమర్పించాలి. ఆ తర్వాత నిత్య హోమము చెయ్యాలి. ఆ తర్వాత యథాశక్తి జపము, స్తుతి చెయ్యాలి. సౌభాగ్య దేవతకు నమస్కరించి బంగారము-వెండి-కాంస్య పాత్రల్లో అష్టదళ పద్మము వెయ్యాలి. దానిమీద గంధముతో బాటు చారు లేదా ముద్రను ఉంచాలి. నేతితో చేసిన తొమ్మిది దీపములను రత్నమంత్రముతో గానీ మూల మంత్రముతో గానీ ఒకొక్క దీపమును మస్తకము మీద ఉంచి అష్టదళ పద్మము పైన ఉంచాలి. మోకాళ్లమీద నిలబడి రెండు చేతులతోనూ ఆ పాత్రను పట్టుకొని “సమస్త చక్రచక్రేశీయుతే దేవీ నవాత్మకే|  ఆరార్తికమిదం దివ్యం గృహాణ మమ సిద్ధయే|” అను మంత్రమును ఉచ్చరిస్తూ దేవి చుట్టూ ఆ దీపములను తిప్పాలి. చివర సమస్త విఘ్నముల శాంతి కొరకు ధ్యానము చెయ్యాలి. ఆ పాత్రను ఎడమవైపున ఉంచాలి.

      ఒక చతురస్ర మండలమును నిర్మించి “ఓం హ్రీం వ్యాపకమండలాయ ఐం నమః” అను మంత్రముతో ఆ వ్యోమచక్రమును పూజించాలి. ఆధారమును అన్యజలముతో కలిపిన పుష్పములతో పూజించి ఆధారమును దాని మీద బలి పాత్రను ఆ మండలములో ఉంచి “ఓం హ్రీం సర్వవిఘ్నకృద్భ్యో భూతేభ్యో హుం స్వాహా” అని మూడుసార్లు పఠిస్తూ బలిని సమర్పించాలి. విఘ్నముల శాంతికొరకు బలిని సమర్పించాలి. ఆ తర్వాత సాధకుడు త్రిపురేశ్వరీ ద్వారా కుమారీని తృప్తి పరచి, పరమేశ్వరీ కిరణములను ధ్యానించి ఖేచరీ ముద్రను ప్రదర్శించి గురు కృప ద్వారా స్వామిని సంవిదాను ఆత్మవిజ్ఞానముతో జోడించాలి. కార్యసిద్ధి కొరకు ఈశాన్యమున శేషముల కొరకు నిర్మాల్యమును ఉంచాలి.

      ఆ తర్వాత గురువుకు అర్ఘ్యపాత్రను సమర్పించి ఉపదేశించబడిన నామ మంత్రముతో సాధకుని లోపల ఉండు స్వామికి తర్పణము ఇవ్వాలి. ఆ తర్వాత తత్త్వముద్రతో సాధకుడు పవిత్రుడై మూల మంత్రమును ఉచ్చరిస్తూ ఇంతకు ముందు ఇచ్చిన ఆరతిలోని మధ్య భాగమును భక్షించాలి. మూడవ తత్త్వముతో స్వాంతవాసినీ దేవీకి తర్పణము ఇవ్వాలి. గురువు ఆజ్ఞానుసారంగా సాధకుడు తనను స్వయంగా త్రిపురాగా భావించాలి. ఆ తర్వాత అన్ని పాత్రలనూ అధోముఖంగా అగ్నియందు ఉంచాలి. ...................

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన బలియజనవిధివివరణం అను అరవైవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: