సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, ఫిబ్రవరి 2021, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 2

 

రెండవ భాగము

మహాలక్ష్మీ పూజా విధి

ఈశ్వరుడు చెబుచున్నాడు -

హే మహేశానీ! ఇప్పుడు నేను ఉత్తమ లక్ష్మీ హృదయము తెలుపుతాను. దీనిని తెలుసుకున్నంతనే ఆపత్తులు పారిపోతాయి. ప్రణవము, హర ఈం ఆత్మకం (హ్రీం), శ్రీపుటము (శ్రీం), కమలేకమలాలయే, రుద్రస్థానము అనగా పదకొండవ స్థానమున భూమి బీజం లం ను, మళ్ళీ ప్రసీద తర్వతా ముందు చెప్పబడిన బీజములను సంపుట రూపంలో జోడించాలి. మహాలక్ష్మీ హృత్ నమః అని చివర జోడించాలి. మంత్ర స్వరూపము ఈ క్రింది విధంగా ఉంటుంది -

ఓం హ్రీం శ్రీం కమలే కమలాలయే లం ప్రసీద ప్రసీద లం శ్రీం హ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః (మొత్తం 28 వర్ణముల మంత్రము)

ఈ మంత్ర ఋషి - దక్షప్రజాపిత| ఛందస్సు - నిచృత్| దేవత - గాయత్రీ హృదయలక్ష్మి (అనగా శ్రీం)| హ్రీం - బీజం| శ్రీం - శక్తిః| ఓం - కీలకం|

షడంగన్యాసము:

ఆం| ఈం| ఊం| ఐం (ఇంద్ర)| ఔం (చంద్రకళ)| అం (అనుస్వారము) - వీటితో షడంగన్యాసము చెయ్యాలి.

ధ్యానం:

రత్నోద్యతసుపాత్రంతుపద్మయుగ్మం చ హేమజం|

అగ్రరత్నావలీరాజదాదర్శం దధతీం పరం||

చతుర్భుజాం స్ఫురద్రత్ననూపురాం ముకుటోజ్జ్వలాం|

గ్రైవేయాంగదహారాఢ్యాం కంకతీరత్నకుండలామ్||

పద్మాసనసమాసీనాం దూతీభిర్మండితాం సదా|

శుక్లాంగరాగవసనాం మహాదివ్యాంగనానతామ్||

భావం: రత్నములతో నిండి ఉన్న సుపాత్రను కలిగినది, స్వర్ణ కమలములు, ఉత్కృష్ఠమైన రత్నములను ధరించినది, నాలుగు భుజములు కలిగినది, మెరుస్తున్న రత్నములు కలిగిన నూపురములు (గజ్జెలు), కిరీటము ధరించినది, ఉజ్జ్వలమైన కంఠాభరణములతో శోభిల్లుచున్నది, కంకతీరత్న కుండలములు కలది, కమలాసనమున ఆశీనురాలైనది, దూతీయల ద్వారా అలంకరించబడునది, శ్వేత అంగరాగములు, వస్త్రములు, ధరించునది, మహా దివ్య స్త్రీల ద్వారా నమస్కరించబడుచున్నది అయిన మహాలక్ష్మిని ధ్యానించాలి.     

యంత్రము:

అష్టదలపద్మము, దానికి వెలుపల భూపురము నిర్మించి ఆ దళ మధ్యన పుష్పమును సమర్పించి పీఠశక్తులను పూజించాలి. నాలుగు దిక్కులందును భారతీ, పార్వతీ, చాంద్రీ, శచీలను, విదిక్కులందు శ్రీధర, హృషీకేశ, వైకుంఠ, విశ్వరూపధృక్ లను సర్వార్థ సిద్ధి కొరకు పూజ చెయ్యాలి.

అనురాగ, విసంవాద, విజయ, వల్లభ, మద, హర్ష, బల, తేజస్విలను అష్టదలములో పూజించి, ఇంద్రాది దిక్పాలకులను భూపురంలో పూజించాలి. ఆ తర్వాత దేవిని పూజించాలి.

సంపదలు కోరుకొను సాధకులు మంత్రమును మూడు లక్షలు జపించాలి. అందులో దశాంశము అనగా ముఫైవేలు కమలములతో హోమము చెయ్యాలి. అలా చేసిన సాధకుని ఇంటికి ఏనుగులు, గుర్రములు వచ్చును. సాధకునకు స్వర్ణ, రత్న భూషణములు లభించును.  

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన మహాలక్ష్మీ పూజావిధి అను రెండవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: