సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, మే 2023, గురువారం

శ్రీదక్షిణామూర్తి సంహిత 64

 పవిత్రారోపణవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – పవిత్రారోపణ అనగా అనుష్ఠాన విధి. పవిత్రారోపణమును చేసినచో అన్ని కార్యములు ఫలించును (సత్యమవును) లేనిచో నిష్ఫలమవుతాయి. అన్యవిధులు చేసిన తర్వాత ఏ సాధకుడు ఈ కర్మను ఒక సంవత్సర కాలంలో చెయ్యడో అతడి పూర్వకర్మల ఫలమును దుష్ట గణములు బలవంతంగా అపహరించును. ఈ పవిత్రారోపణ కర్మకు ఆషాఢ మాసము ఉత్తమము. శ్రావణం మధ్యమం, భాద్రపదం హీనము. శుక్ల పక్షము ప్రశస్తము. కృష్ణ పక్షము లాభరహితము అవుతుంది. చతుర్దశీ, అష్టమి, పూర్ణిమ తిథులలో ఈ కర్మ చెయ్యాలి. రేశ్మీ సూత్రము (దారము) విశిష్టము. నూలు దారమును కూడా ఉపయోగించవచ్చును. ఈ సూత్రముకు తొమ్మిది రెట్లు గంగాజలముతో పశ్చిమాస్య మంత్రములతో సూత్రమును శుద్ధి చేసి ఆరబెట్టాలి. మంత్రోచ్చారణ చేస్తూ సుందరమైన పవిత్రమును తయారు చెయ్యాలి. 108అంగుళముల పవిత్రము శ్రేష్ఠము. 54అంగుళముల పవిత్రము మధ్యమము. 27అంగుళముల పవిత్రము కనిష్ఠము.

      ఊర్థ్వముఖోక్త మంత్రముల ద్వారా పది గంట్లు పెట్టాలి. కుంకుమాది విచిత్ర పదార్థములతో వాటికి రంగు పులమాలి. పవిత్ర దానమునకు ఒకరోజు ముందు అధివాసము చెయ్యాలి లేనిచో అదే రోజు కూడా అధివాసము చెయ్యవచ్చును. రాత్రి సమయాచారులతో నిత్యపూజాదులు నిర్వహించి సింహాసనము మీద మంత్రముల ద్వారా సాధకుడు సూత్రమును ఉంచాలి. ప్రార్థన చేసిన తర్వాత అస్త్రము మరియు కవచము ద్వారా కవచము, అవగుంఠనము చేసి దాతౌన (=?), గంధము, భస్మము, చందనము, మట్టి, ఆవాలు, ఉసిరి, మద్యము – ఈ ఎనిమిది కుల ద్రవ్యములను ఎనిమిది దిక్కులలో సిద్ధి కొరకు రావి ఆకులమీద ఉంచాలి. హుంకార, సోమ, సాదేశ, బ్రహ్మ, నాగ, శిఖిధ్వజ, సూర్య, సదాశివ, త్రిపుర – వీరిని నవ దేవతలని అంటారు. నవసూత్రములలో వీరిని పూజించాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను మూడు సూత్రములలో పూజించాలి.

      గ్రంథిలో ఉండు క్రియా, పౌరుషి, వీరా, గాయత్రి, అపరాజితా, విజయా, జయా, ముక్తిదా, సదాశివ – ఈ నవ దేవతలను సమస్త ఉపచారములతో పూజించాలి. మూలమంత్రముతో ఆమంత్రణ చేసి పవిత్రములో కళలను పూజించాలి. 16నిత్యలను మరియు శ్రీవిద్యను ధ్యానించాలి. ఈ విధంగా అధివాస విధి చెప్పబడినది. ఆ తర్వాత ఆరాధన చెయ్యాలి. ఆ తర్వాత నైమిత్తికార్చన చెయ్యాలి. అందరికీ పవిత్రమును ఇచ్చి, కన్యలకు భోజనము పెట్టి ఆ తర్వాత గురువుకు వస్త్రాలంకారములు, గోవులు, ధనము మొదలగునవి యథాశక్తి సమర్పించి పూజించాలి. గురువుకు నమస్కరించి ఆయనను దేవీ రూపంగా ధ్యానించాలి. ఆ తర్వాత పవిత్రమును (జంధ్యమును) ధరించాలి.

      ఎక్కడ గురుపూజ జరుగుతుందో అక్కడ పూజ చేసినవారికి పూజా ఫలం లభిస్తుంది. గురుపూజ చేయకపోతే చేసిన క్రియ అంతా నిష్ఫలమైపోతుంది. గురువు దగ్గర లేనిచో గురుపుత్రునకు, గురుపుత్రుడు లేనిచో గురుపత్నికి, గురుపత్నిలేనిచో గురుమనుమనికి, గురు మనవడు లేనిచో గురు కూతురుకొడుకునకు పూజ చెయ్యాలి. గురుసంబంధితులు ఎవరూ లేనిచో అన్య గోత్రములో పుట్టిన గురువుకు పూజ చెయ్యాలి. హోమము, పూర్ణాహుతి చేసి శ్రీచక్ర మధ్యలో ఉండు త్రిపురాను పూజించి సమస్త పూజను ఆమెకు సమర్పించాలి. ఈ ఉత్తరపూజను ఆచరించనిచో క్రియ అంతా నిష్ఫలమవుతుంది.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన పవిత్రారోపణవిధివివరణం అను అరవైనాల్గవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: