సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, నవంబర్ 2020, గురువారం

మహామనుస్తవం - 10

 

10.   గురుచరణైః సంక్రమితాం వర్ణమయీమంబికామనుధ్యాయన్|

       గురువరసంపదమలభే యదహం సా త్రిపురసుందరీకరుణా||

త్రిపురసుందరిని వర్ణమయీ రూపములో నిత్యమూ ధ్యానించగా నాకు ఆమె నిజమైన కరుణ వలన మహాగురురువులు అనే సంపద లభ్యమయినది.


శాస్త్రిగారికి శ్రీవిద్యా మహామంత్రమును మొదటగా వారి తండ్రిగారు ఉపదేశించారు. ఆయన ఆ మంత్ర సాధన నిత్యం భక్తిశ్రద్ధలతో జపించగా ఆయనకు ముందుగా శ్రీ కావ్యకంఠ వషిష్ఠ గణపతి మునిగారి దర్శనము కలిగెను. తర్వాత శాస్త్రిగారు గణపతిమునిగారి శిష్యుడై శ్రీరమణమహర్షి గారి ఉపదేశములను, అధ్యాతిమిక గమనమును తెలుసుకోగలిగెను. ఆ తర్వాత మరికొన్నాళ్ళకు శాస్త్రిగారికి శ్రీఅరబిందో మరియు అమ్మ సాన్నిధ్యం లభించి వారిచెంతనే ఆశ్రయము పొందెను.

ఇక్కడ మనము గమనించవలసిన విషయము - అమ్మవారి వర్ణమయీ రూపము అనగా ఆమె పంచదశీ మంత్రము. అదియే శ్రీవిద్యామంత్రము. ఏ విద్యకైనా గురువే ప్రధానము. గురువులేని విద్య వ్యర్ధము. శాస్త్రిగారి త్రికరణశుద్దియైన ఉపాసనా కారణంగా అమ్మవారు ఆయనకు మహాగురువులు అనే మహాసంపదను ఇచ్చేను. ఈ విషయంలో మనము ఎటువంటి సందేహములూ పెట్టుకోనవసరం లేదు.

ఎందుకంటే, నా సహోధ్యాయుల్లో ఒకరికి ఇదే అనుభవం కలిగినది. వారు పంచదశీ మంత్రమును గురువు లేకుండానే జపము చేస్తుండేవారు. ఆ తర్వత కొన్ని రోజులకు వారు శ్రీశృంగేరి పీఠాధిపతుల వారిని దర్శించడం జరిగింది. వారు పీఠాధిపతులవారికి తను చేస్తున్న జపమును తెలిపి సద్గురువు కొరకై ప్రార్ధించారు. అప్పుడు పీఠాధిపతుల వారి ఆజ్ఞానుసారం వారి సాన్నిధ్యంలో కొన్ని గంటలబాటు జపము చేయగా, వారికి మరికొన్ని రోజుల్లోనే సద్గురువు లభ్యమయి శ్రీవిద్యలో పూర్ణదీక్షాపరులైనారు.

కనుక అమ్మ కరుణ అపారము. ఆమె వర్ణమయి. ఆమె స్థూలదేహము, సూక్ష్మదేహము (మంత్రము) వేరు కాదు. 

ఇలా ఒకరిద్దరికి జరిగింది కదా అని అందరూ మహామంత్రమును గురూపదేశము లేకుండా చేయరాదు. గురువుగురించి పరితపిస్తూ శ్రీలలితారహస్యనామ జపమును ముందుగా చెయ్యాలి. అప్పుడు వారి త్రికరణశుద్ధి ప్రకారము వారికి తప్పక సద్గురువు లభించును. ఇందులో ఎటువంటి సందేహము లేదు.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: